0

లేడీ కలెక్టర్ అర్ధ రాత్రి ... బైక్ మీద ఒంటరిగా


హైదరాబాద్: ఇసుక అక్రమార్కులను పని పట్టేందుకు వికారాబాద్ సబ్ కలెక్టర్ అలుగు వర్షిణి అర్ధరాత్రి ఒంటరిగా బైక్‌ మీద కాగ్నా నదికి వెళ్లారు. తన వెంట పోలీసులను కూడా తీసుకెళ్లకుండా ఇసుక మాఫియాకు చెమటలు పట్టించారు.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. యాలాల మండలం బెన్నూరు, తాండూరు పట్టణ శివారులోని కాగ్నా నదిలో అర్ధరాత్రి ఇసుక తవ్వకాలను చేపడుతున్నారు. పెద్ద పెద్ద బ్యాటరీల సాయంతో లైట్ల వెలుతురులో అక్రమంగా ఇసుకును తవ్వి పోసుకుంటున్నారు. 

ఈ విషయం తెలుసుకున్న వికారాబాద్ సబ్ కలెక్టర్ అలుగు వర్షిణి అర్ధరాత్రి దాటాక ఒంటిగంట ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్న ప్రాంతానికి వెళ్లారు. ఎవరికీ అనుమానం రాకుండా తన వాహనాన్ని తాండూరు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిలిపి, అక్కడి నుంచి బైక్‌పై వెళ్లారు.

ఇసుక నింపే లేబర్లు, ట్రాక్టర్‌ డ్రైవర్లు సబ్ కలెక్టర్‌ను చూసి పోలీసులు వచ్చారంటూ అక్కడి నుంచి పారిపోయారు. దాంతో సబ్‌ కలెక్టర్‌ వారిని వెంబడించారు. బెన్నూరు గ్రామం వద్ద కూలీలను పట్టుకున్నారు. వారిని పోలీసులకు అప్పగించారు. 


బైక్‌లు, ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన కూలీలకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మళ్లీ అక్రమ తవ్వకాలు చేపడితే ఆధార్‌, రేషన్‌ కార్డులు తొలగిస్తామని హెచ్చరించారు. అంతేకాదు ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌, బైక్‌ స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.




Previous
Next Post »