0

కృష్ణాజిల్లా లో వానతో పాటు చేపలు పడ్డాయోచ్


ఆకాశం నుంచి చేపలు పడుతున్నాయా? ఇదేంటి? ఆశ్చర్యంగా ఉంది కదూ.. అవునండి. కృష్ణాజిల్లా నందిగామ మండలం గోళ్లమూడి వాసులు ఆకాశం నుంచి పడుతున్న చేపలని పట్టుకుంటున్నారు. ఓ వైపు జోరుగా వర్షం కురుస్తున్నా.. రోడ్లపైనే బుట్టలు పట్టుకుని అటూ ఇటూ తీరిక లేకుండా తిరుగుతున్నారు. ఎందుకుంటే.. అక్కడ ఆకాశం నుంచి పడుతున్న వర్షపు చినుకులతో పాటు చేపలు పడుతున్నాయి. అది కూడా వాలుగ రకం చేపలు కావడంతో జనం ఎగబడుతున్నారు. 

నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జనం ఇంటిపట్టునే ఉంటున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా చినుకులతో  పాటు చేపలు కూడా ఆకాశం నుంచి పడుతుండటంతో బుట్టలు చేతబట్టుకుని వర్షంలోనే తడుస్తూ చేపల వేట సాగిస్తున్నారు.

కాగా అసలు ఆకాశం నుంచి చేపలు వర్షంతోపాటు ఎందుకు పడుతున్నాయి...? అనే సందేహం మనకు కలగడం సహజమే. ఐతే గతంలో ఇలాంటి చేపల వాన థాయిల్యాండులో కూడా కురిసింది. ఆ తర్వాత సైంటిస్టులు దీర్ఘంగా పరిశీలిస్తే దానికి టోర్నడోలు కారణమని తేలిందట. టోర్నడోలు అత్యంత బలమైన వేగంతో సుడులు తిరిగే గాలులతో కూడుకుని ఉంటాయి. అవి ఏ చేపల చెరువో లేదంటే సముద్రంపైగానే వస్తే అందులో ఉండే జలచరాలను కూడా లాక్కెళుతుందట. కాబట్టి అలాంటిదే నందిగామలో కూడా జరిగి ఉంటుందని అనుకుంటున్నారు.


ఇదిలా ఉంటే.. నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావం పలు రాష్ట్రాల్లో బలంగా కనిపిస్తోంది. ముంబయిలో గురువారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. రైల్వే ట్రాక్ లు నీటమునిగాయి. పలు కాలనీలు జలమయమయ్యాయి. లోకల్ రైళ్లు నిలిపివేశారు. స్థానిక రవాణా వ్యవస్థకు అంతరాయం కలగడంతో జనజీవనం స్తంభించిపోయింది. అదనపు బస్సులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


Previous
Next Post »